రామాపురం అనే ఊళో గోవిందుడు అనే పిల్లాడు ఉండేవాడు. ఓ రోజు గోవిందుడిని వాళ్ల నాన్న పిలిచి పక్క ఊరిలో ఉండే తన స్నేహితుడి ఇంటికి వెళ్లమనీ… అతడో చిన్న పెట్టె ఇస్తాడనీ దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలనీ చెప్పాడు. దాంతో గోవిందుడు తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం పక్క ఊళ్లో ఉండే ఆ స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. ఆయన కొన్ని వస్తువులున్న పెట్టెను గోవిందుడి చేతికి ఇస్తూ… ‘దార్లో దొంగలు ఉంటారు. ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్లు’ అని చెప్పాడు. ఇంటికి వచ్చే క్రమంలో గోవిందుడికి తన వెనకాల ఎవరో వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరో దొంగ తనని వెంబడిస్తున్నాడని తెలుసుకున్నాడు. దాంతో భయపడుతూనే కాస్త వేగంగా నడవడం మొదలుపెటాడు. ఆ అడుగుల చప్పుడు వేగం కూడా పెరిగేసరికి… గోవిందుడికి ఏం చేయాలో పాలుపోలేదు. కొంతదూరం వెళ్లేసరికి గోవిందుడికి ఓ నది కనిపించింది. దాన్ని చూడగానే అతడికో ఆలోచన వచ్చింది. వెంటనే నదికి కాస్త పక్కగా ఉన్న పొదల్లోకి తన దగ్గరున్న పెట్టెను విసిరేసి, నది ఒడ్డున నిలబడి… ‘నా పెట్టె నీళ్లలో పడిపోయింది..’ అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. గోవిందుడి వెనకాలే వస్తున్న దొంగ ఎలాగైనా ఆ పెట్టెను తీసుకోవాలనే ఉద్దేశంతో తాను తీసిస్తానంటూ నదిలోకి దూకి వెతకడం ప్రారంభించాడు. అదే అదను అనుకున్న గోవిందుడు… పొదల్లోకి విసిరిన పెట్టెను తీసుకుని
గబగబా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Similar Posts